*కాందిశీకుల భూములను నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలి!*
*నిరుపయోగ కాందిశీకుల పోరాట ఐక్యవేదిక డిమాండ్*
ఉత్తర నియోజకవర్గం నెహ్రూనగర్ న్యూ బర్మా కాలనీలో కాందిశీకుల పునరావాసం కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను కొందరు అక్రమంగా ఆక్రమించి షెడ్లు నిర్మించడం అత్యంత విచారకరమని
నిరుపయోగ కాందిశీకుల పోరాట ఐక్యవేదిక ప్రతినిధులు ఆరోపించారు. బర్మా కాలనీలో బాధితులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.. ప్రభుత్వ భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమైన చర్య అని, ఇటువంటి అక్రమ ఆక్రమణలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమంగా నిర్మించిన అన్ని షెడ్లను తొలగించి, ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే కాందిశీకుల పునరావాసం కోసం కేటాయించిన భూమిలో నిజమైన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ద్వారా పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి తగిన శిక్షలు విధించాలన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నిరుపయోగ కాందిశీకుల పోరాట ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, దీపక్, ఇంటి శ్రీనివాసరావు, శివకుమార్, బాబు, సింహాచలం, అధిక సంఖ్యలో బర్మా కాంధీశీకుల బాధితులు పాల్గొన్నారు.