విశాఖలో ‘సీఎన్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కార్యాలయాన్ని ప్రారంభించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
*యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్*
*చెల్లుబోయిన నరసింహారావు వ్యాపారంతో పాటు సామాజిక సేవ చేయడం అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్*
*ఈ నెలాఖరు నాటికి రుషికొండ భవనాల వినియోగంపై స్పష్టత: మంత్రి కందుల దుర్గేష్*
*వైజాగ్ పర్యాటక రంగానికి మహర్దశ.. రూ. 5,000 కోట్లతో 16 స్టార్ హోటళ్లకు అనుమతి*
*ఆంధ్రప్రదేశ్లో 7 స్టార్ హోటల్ ఏర్పాటుకు 'లీలా గ్రూప్' ఆసక్తి: పర్యాటక మంత్రి దుర్గేష్*
విశాఖపట్నం:విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సీఎన్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కార్యాలయాన్ని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం చెల్లుబోయిన రాము, నరసింహారావు, చంటిలకు మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జనసేన పార్టీకి చెందిన చెల్లుబోయిన నరసింహారావు వ్యాపారంతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యం కావడం గొప్ప విషయమని మంత్రి దుర్గేష్ కొనియాడారు. స్థానికంగా జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి చెల్లుబోయిన నరసింహ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నరసింహ లాంటి యువత వ్యాపార, పారిశ్రామిక రంగాలలో రాణిస్తూ పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. ‘సీఎన్ఆర్ వెంచర్స్’ తరహాలో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టి యువతకు ఉపాధి చూపాలని, రాజకీయంగా, పారిశ్రామికంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
*ప్రాంతీయ అభివృద్ధి – పర్యాటక ప్రోత్సాహం:*
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విశాఖ-విజయనగరం ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు. వైజాగ్ పారిశ్రామికంగా, ఐటీ, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అరకు, లంబసింగి, బొర్రా గుహలు తదితర ప్రాంతాలను పర్యాటకంగా మరింత తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. విశాఖలో జరుగుతున్న ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO)’ సమావేశం పర్యాటక శాఖకు, టూర్ ఆపరేటర్లకు మధ్య సయోధ్యను పెంచుతుందన్నారు.
*రుషికొండ భవనాల సద్వినియోగంపై స్పష్టత:*
గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తూ హరిత రిసార్ట్స్ స్థానంలో రుషికొండ ప్యాలెస్ నిర్మించడం వల్ల పర్యాటకశాఖ తరఫున భారీ ఆదాయం కోల్పోయామని, ప్రస్తుతం దాని నిర్వహణ కూడా భారంగా మారిందని మంత్రి దుర్గేష్ తెలిపారు.రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా హాస్పిటాలిటీకి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడుకు నివేదిక అందించామని , ఈ నెలాఖరు నాటికి స్పష్టమైన నిర్ణయం రానుందని వెల్లడించారు. రుషికొండ కింద ఖాళీగా ఉన్న 9 ఎకరాల స్థలంలో 7.5 ఎకరాలు సిఆర్జెడ్ నిబంధనల పరిధిలో ఉన్నందున కట్టడాలకు ఆస్కారం లేదని, మిగిలిన 1.5 ఎకరాల్లో హాస్పిటల్, రిసార్ట్స్, మైస్ సెంటర్ల ఏర్పాటుకు సంస్థల నుంచి 'ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్' ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
రూ. 5,000 కోట్లకు పైగా ప్రైవేట్ పెట్టుబడులతో 980 గదుల సామర్థ్యంతో విశాఖలో 16 స్టార్ హోటళ్లకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. వీటిలో ఇప్పటికే 6 హోటళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ రంగానికి 'పారిశ్రామిక హోదా' కల్పించడం ద్వారా ప్రాజెక్టులకు పెద్దపీట వేసినట్లయిందన్నారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో లీలా గ్రూప్ సంస్థతో చర్చలు జరిగాయని, ఏపీలో 7 స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపుతోందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
*జారీ చేసినవారు: పిఆర్ఓ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు*